ఖరీఫ్ ధాన్యం సేకరణలో సూర్యాపేటకు రికార్డు స్థాయి
సాక్షిత సూర్యాపేట, :
ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం సేకరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో 62,887 మంది రైతుల నుంచి మొత్తం 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2025–26 ఖరీఫ్ సీజన్కు గాను జిల్లావ్యాప్తంగా ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), మెప్మా, ఎఫ్పీఓల ఆధ్వర్యంలో మొత్తం 348 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వీటి ద్వారా 62,887 మంది రైతుల నుంచి 2,27,320.560 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 1,00,258.720 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేసి, మొత్తం 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వివరించారు. ఈ సేకరణకు గాను రైతులకు మద్దతు ధర కింద రూ.782.59 కోట్లను చెల్లించగా, బోనస్ రూపంలో మరో రూ.113.65 కోట్లను చెల్లిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించినందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, ఎస్హెచ్జీలు, మెప్మా, పీఏసీఎస్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
