ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అంతకు ముందు నెక్లెస్ రోడ్డులో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు.
ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రేవంత్ రెడ్డి సర్కార్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాలన బలహీన వర్గాలకు సువర్ణ అధ్యాయమని, ఆమె పరిపాలన ఒక మోడల్ అని కొనియాడారు.
ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో ‘ప్రజాపాలన’ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతోనే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ జయంతి రోజు అయిన నేడు ప్రారంభించి డిసెంబర్ 9 వరకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేస్తామని మొత్తం కోటి చీరలను రెండు విడతలుగా అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్గా మారాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు, ఆర్థిక ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి తో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ నరసింహ, వాకిటి శ్రీహరి, కొండ సురేఖ, సీతక్క, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
