కమ్యూనిటీ హాల్ కు మళ్లీ శంకుస్థాపనలు ఎందుకు

Sakshitha news

2023లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన కమ్యూనిటీ హాల్ కు మళ్లీ శంకుస్థాపనలు ఎందుకు?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: 2023లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో సీడీపీ (CDP) నిధులతో మంజూరైన కృషి కాలనీ లోని కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్వయంగా శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పటికే మంజూరై, గతంలోనే శంకుస్థాపన చేసిన అదే కమ్యూనిటీ హాళ్ కు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మళ్లీ శంకుస్థాపనలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా వారు విమర్శించారు.
ప్రభుత్వ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు ఎవరు కృషి చేశారో ప్రజలకు స్పష్టంగా తెలుసని, గతంలో శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేయడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
“పనులు చేయాలి కానీ, ఇప్పటికే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లీ శంకుస్థాపనలు చేసి రాజకీయ ప్రచారం చేసుకోవడం సరికాదు. ప్రజల కోసం మంజూరైన నిధులతో పనులను త్వరగా పూర్తి చేయడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి పెట్టాలి” అని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే
కేపీ వివేకానంద్‌ నియోజకవర్గ అభివృద్ధికి సీడీపీ నిధులను సమర్థవంతంగా వినియోగించి పలు కమ్యూనిటీ హాళ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారని వారు పేర్కొన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజకీయ ప్రచారాలకు స్వస్తి పలికి, ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు.

Scroll to Top