ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట
పెద్దపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…..
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, మంథని నియోజకవర్గాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, సభా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ విజయరమణ రావుతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు, ప్రజా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు.
అభివృద్ధి పనుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర మంత్రుల సహకారంతో పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి, అన్ని ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
