మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి…

Sakshitha news

మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి…

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, బహిరంగ సభకు పక్కా ఏర్పాట్లు….

–కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : మంథని నియోజకవర్గంలో బుధవారం రాష్ట్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంథని పట్టణంలో కలెక్టర్ పర్యటించి గంగపురిలో భూమిపూజ చేయనున్న ఎన్ ఏ సి భవన నిర్మాణ స్థలాన్ని, బస్సు డిపో సమీపంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రాంతాలను, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంథనిలో NAC భవన నిర్మాణానికి భూమిపూజతో పాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మంత్రుల పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంథని పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

మంత్రులు పర్యటించే మార్గాలను ముందుగానే పరిశీలించి రోడ్లు, పరిసరాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు.
పర్యటన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్ణీత సమయానికి జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేపట్టాలని సూచించారు.

మంత్రుల పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ ఆరిఫుద్దీన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top