రాజముద్రతో పట్టాదారు పాసుబుక్స్-రైతన్నలకు సంపూర్ణ భరోసా.
-ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్.
కీర్తిరాయునిగూడెంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
మైలవరం, ఆగస్టు 6:
రాజముద్రతో పట్టాదారు పాసుబుక్స్ పంపిణీతో రైతన్నలకు సంపూర్ణ భరోసా కల్పిస్తున్నామని ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ పేర్కొన్నారు.
మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెం గ్రామ రెవెన్యూ రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం గ్రామ సచివాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తూ, ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో రైతుల భూ హక్కులకు పూర్తి రక్షణ లభిస్తోందని, రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు శాశ్వత భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి నాయకత్వంలో నియోజకవర్గ రైతులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా చేరుతున్నాయని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించి పాస్ బుక్స్ ఇచ్చి రైతుల హక్కులకు భంగం కలిగించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంత విధానాలకు పాసు బుక్స్ కూడా తార్కాణంగా నిలిచాయన్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాసు పుస్తకాలలో ఏమైనా పొరబాట్లు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పోనకళ్ళ నవ్య శ్రీ, శోభన్ బాబు, శీలం బ్రహ్మయ్య, నంబూరి శ్యాం ప్రసాద్, రెవెన్యూ అధికారులు, స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


