ప్రజా ఉద్యమాలే సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీని గెలిపిస్తాయి
కావడిగుండ్ల సర్పంచ్ అభ్యర్థి బాడిశ లక్ష్మణరావు
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
కావడిగుండ్ల గ్రామంలోని
అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి నడిపించిన చరిత్ర సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీకి ఉందని ప్రజా ఉద్యమాలే గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తాయని దొంగ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కావడిగుండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి బాడిశ లక్ష్మణరావు తెలిపారు. గత 30, 40 సంవత్సరాలుగా అనేక భూ పోరాటాలు, కూలీ పోరాటాలు, అనేక ఉద్యమాలు నిర్మించి ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధికర మార్గంలో నడిపించుకున్న చరిత్ర సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీకి ఉందని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పోడు పోరాటాలు నిర్వహించి, పోడు భూములను ప్రజలకు పంచిన చరిత్ర కేవలం సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీకే ఉందని, ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కావడిగుండ్ల గ్రామాన్ని గ్రామ ప్రజల సహకారంతో రాష్ట్రస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా విశేషమైన కృషి జరిగిందని, ఆ ప్రజా చైతన్యమే పంచాయతీ ఎన్నికలలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే నెరవేర్చలేక ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని, గ్రామపంచాయతీ స్థాయిలో అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలి అనుకోవడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. ఇప్పటివరకు ప్రజా సమస్యలలో పాలు పంచుకోలేని వారు, ప్రజల అభివృద్ధిని అడ్డుకున్న వారు ఇప్పుడు అధికారం కోసం ప్రజలకు ఏదో చేస్తామంటూ ఉచిత హామీలు ఇవ్వడాన్ని ప్రజలు స్వాగతించరన్నారు. ఏజెన్సీలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమాలు పోడు పోరాటాల ద్వారా పోడు భూములకు పట్టాలు సాధించుకున్నామన్నారు. పత్తి పంటకు గ్రామ ప్రజల ఉమ్మడి కృషితో గిట్టుబాటు ధర సాధించుకున్న చరిత్ర ఉందన్నారు. ఇలా ఉద్యమాల ద్వారా అనేక విజయాలు కూడా సాధించామన్నారు. గ్రామపంచాయతీ ప్రజలందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల కోసం నిలబడే నికార్సైన సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ సర్పంచి అభ్యర్థి బాడిశ లక్ష్మణరావు, వార్డు మెంబర్లను గెలిపించాలని వారు ప్రజలను కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
