రామలక్ష్మణుల బంధం మాది
** చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, చంద్రగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడుతో తనది
రామలక్ష్మణుల బంధం అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గుర్తు చేసుకున్నారు.
పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెంది 3 నెలలు కావడంతో త్రైమాసిక కార్యక్రమం నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన చంద్రగిరి మండలం, పనబాకం పంచాయతీ, గడ్డంవారిపల్లిలో పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు
కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సతీమణి పులివర్తి సుధా రెడ్డిలు పాల్గొని భావోద్వేగం చెందారు.
దివంగత నేత చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ
సుబ్రహ్మణ్యం నాయుడు కేవలం పార్టీ నేత మాత్రమే కాదని, తన సోదరుడిగా కుటుంబ సభ్యులలో ఒకడిగా మెలిగామని పేర్కొన్నారు. ఆయన ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన నిజాయితీ నాయకుడని, పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గొప్ప నేత అని కొనియాడారు. ఆయన నా సోదరుడు. మేమిద్దరం చంద్రగిరి మండలంలో కలిసి తిరుగుతున్నప్పుడు, రామలక్ష్మణులు వచ్చారని స్థానికులు ప్రేమగా అనేవాళ్లు. నా కుటుంబ సభ్యులలో ఒకడిగా ఆయన నాతో మెలిగారు,” అని తమ బంధాన్ని గుర్తుచేసు కున్నారు. ఆయన మన మధ్య లేకపోవడం నాతో పాటు పార్టీకి తీరని లోటు. ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి అని నాని భావోద్వేగంతో తెలిపారు.
ఈ నివాళుల కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బంధుమిత్రులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడుకి అశ్రు నివాళులు అర్పించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
