కోదాడ మీదుగా బుల్లెట్ రైలు మార్గం వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి..
అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి బుల్లెట్ రైలు సాధన సమితి నాయకులు …సెప్టెంబర్ 15 (సాక్షిత న్యూస్): సూర్యాపేట జిల్లా/కోదాడ మీదుగా బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటు చేస్తే కోదాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని బుల్లెట్ రైలు సాధన సమితి నాయకులు పేర్కొన్నారు.మంగళవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో కనగాల నారాయణరావు ఆధ్వర్యంలో బుల్లెట్ రైలు సాధన సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముందుగా అఖిలపక్ష నాయకులతో రైలు సాధన సమితి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో సాధన సమితి కమిటీ ఇచ్చే పిలుపును అందుకుని ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా కోదాడ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక అభివృద్ధి, మెరుగైన రవాణా సౌకర్యాలు, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్–సూర్యాపేట–కోదాడ–విజయవాడ–చెన్నై మార్గంలో బుల్లెట్ రైలును కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేయాలని కమిటీ నిర్ణయించింది.
ఈ ప్రాంతం ద్వారా బుల్లెట్ రైలు అనుసంధానం జరిగితే కోదాడతో పాటు సూర్యాపేట జిల్లా ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారం, పరిశ్రమలు, పెట్టుబడుల పరంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నాయకులు తెలిపారు. అలాగే ప్రాంతం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
బుల్లెట్ రైలు మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్–కోదాడ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు, భవిష్యత్లో కోదాడను ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST