విద్యార్థుల భద్రతే లక్ష్యం.. షీ టీమ్ అవగాహన

Sakshitha news

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. షీ టీమ్ అవగాహన
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి….

–షీ టీమ్…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి షీ టీమ్ సభ్యులు ఎన్‌టీపీసీ సుభాష్‌నగర్‌లోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, పోక్సో చట్టం, సోషల్ మీడియా వల్ల పిల్లలపై కలిగే ప్రభావం, విద్యార్థుల ప్రవర్తనా నియమాలు తదితర అంశాలను వివరించారు. మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై కూడా అవగాహన కల్పించారు.

మహిళల రక్షణ కోసం ప్రతిరోజూ బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

మహిళలకు ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100/112కు డయల్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించుకోవాలని తెలిపారు.

విద్యార్థులు అప్రమత్తంగా ఉంటేనే భద్రమైన సమాజం సాధ్యమని షీ టీమ్ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top