80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్ లో గల గణేష్ నగర్ లో 80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన స్వతంత్ర దినోత్సవం వేడుకలకు మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి వందనం చేసి, దేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, వారి అపారమైన త్యాగాలు, ధైర్యసాహసాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. స్వేచ్ఛా భారతదేశంలో మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు, ప్రతి స్వాతంత్ర్యానికి వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఉందని అన్నారు.
స్వాతంత్ర్యం అనేది కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, సామాజిక సమానత్వం, సోదరభావం మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, కులమతాలకు అతీతంగా భారతీయులుగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, దుర్గ రావు, లింగం యాదవ్, వెంకటేశ్ యాదవ్, నరసింహ రెడ్డి, భాస్కర్ గౌడ్, గణేష్, యాదగిరి, మురళి తదితరులుతొ పాటు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


