హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 10న. జైల్ భరోను విజయవంతం చేయాలి…..
—గీట్ల లక్ష్మారెడ్డి….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఎన్టీపీసీ ప్లాంట్ గేటు–2 వద్ద యూనియన్ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి కార్మికులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే నేడు కార్మికులు, రైతులు, ప్రజలు ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
కార్మికుల హక్కులను హరించే నాలుగు కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, రుణ విమోచన చట్టం తీసుకురావాలని, ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆగస్టు 10న. చేపట్టనున్న జైల్ భరో కార్యక్రమాన్ని గ్రామాలు, బస్తీలు, పారిశ్రామిక ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తరతరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే ఐక్య పోరాటమే మార్గమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎండి యాకూబ్, ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి, కాదాసి మల్లేష్, కె. రాజ్కుమార్, ఎ. చంద్రమౌళి, ఎల్. దేవేందర్ రెడ్డి, బి. వెంకన్న, రవి, పరమేష్, కనకయ్య, రహమత్ అలీ, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
