విద్యార్థుల కంటి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత నేత్ర పరీక్షా శిబిరం…..
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, : రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, హెల్పింగ్ హాండ్స్ తెలంగాణ సహకారంతో, జాతీయ సేవా పథకం సమన్వయంలో ఉచిత నేత్ర పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణులు విద్యార్థులకు కంటి సంరక్షణ, కంటి వ్యాధుల నివారణ, సమయానికి పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి, ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించారు.
కార్యక్రమంలో కళాశాల ఉప ప్రిన్సిపాల్ సాంబశివరావు మాట్లాడుతూ కంటి ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అమూల్యమైనదని, దానిని కాపాడుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత అని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యుడు మీస వికాస్ కంటి చికిత్స, జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఫౌండేషన్ అధ్యక్షుడు రౌతు గణేష్ మాట్లాడుతూ సమాజ సేవే తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మీస వికాస్, మార్కా ఆశ్రిత్ గౌడ్, వసీం, అశ్వన్, అక్షయ్, విశ్వ, జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
