ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.

Sakshitha news

ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….

గోదావరి తల్లికి వాయినం సమర్పించి ప్రత్యేక పూజలు…

వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం, నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి తల్లికి సంప్రదాయబద్ధంగా వాయినం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, రాష్ట్ర ప్రజలను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని ప్రార్థించారు.

అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top