భారీ వర్షాల వేళ రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:బెల్లంపల్లి, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ, 33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆయన వెంట ఉన్నారు.
బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు మరింత కట్టుదిట్టంగా అమలు చేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను వరద నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, 27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు, బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, ఇతర ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
