భారీ వర్షాలకు ఇల్లు గోడలు కూలిన బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని , . నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రామగుండం నగరంలోని 50వ. డివిజన్ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ వెనుక నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీమతి రేష్మ ఇంటి గోడలు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ఘటన గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధి వెంటనే రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మార్వో రవీందర్ రావును ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య యాదవ్, ఏసీపీ మడత రమేష్, సీఐ ఇంద్రసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
