నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
జూలై 30న పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా….
– ₹21 వేల వరకు వేతనం, శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం మరో ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూలై 30, 2026న పెద్దపల్లిలోని టాస్క్ (TASK) రీజనల్ సెంటర్ (ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని బస్ డిపో ప్రాంగణం)లో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ సమీపంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలో ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹18,000 నుంచి ₹21,000 వరకు వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉచిత భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
అదే రోజు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం మూడు నెలల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కు నమోదు, ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించి, అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఇతర అవసరమైన పత్రాలతో జూలై 30న ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలోని టాస్క్ రీజనల్ సెంటర్లో జరిగే ఇంటర్వ్యూలు, నమోదు ప్రక్రియకు హాజరుకావాలని సూచించారు.

