త్యాగం – ప్రేమ – సోదరభావానికి ప్రతీక బక్రీద్….
ఈద్గా ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం నియోజకవర్గం,
బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం శారద నగర్, రామగుండం ఫ్లోరింక్లైన్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో పరస్పర గౌరవం, మానవతా విలువలు పెంపొందించేందుకు ఈ పండుగ సందేశం ఎంతో గొప్పదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, కాలనీల అభివృద్ధి వంటి పలు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
