వడ్ల నిల్వలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకస్మిక తనిఖీ రైతులు ఆందోళన చెందొద్దు.. ప్రభుత్వం అండగా ఉంది….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
రామగుండం నియోజకవర్గంలోని పొట్యాల గ్రామ ఐకేపి సెంటర్లో నిల్వ ఉంచిన వడ్లకు ఎండ తీవ్రత కారణంగా స్వల్పంగా మంటలు అంటుకున్న ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఐకేపి సెంటర్లోని వడ్ల నిల్వలను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపి కేంద్రాల్లో వడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రత కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వడ్ల కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను మరింత వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
