బాలికపై లైంగిక దాడి ఆరోపణలపై నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి….
కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి….
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ రేణుకుంట్ల విజేత-ప్రీతం …
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ రేణుకుంట్ల విజేత డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రేణుకుంట్ల విజేత మాట్లాడుతూ, మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు బాధిత కుటుంబం పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసులో సరైన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఈ ఆరోపణలపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె కోరారు. రాష్ట్రంలో చట్టాలు అందరికీ సమానంగా అమలుకావాలని, తప్పు చేసిన ఎవరినైనా శిక్షించాలని పేర్కొన్నారు.
సిట్ విచారణ పేరుతో కేసును జాప్యం చేయకుండా వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. “మేము తప్పు చేయలేదు” అని చెబుతున్నప్పటికీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.
కేసు నమోదు అయి ఐదు రోజులు గడిచినా ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం ద్వారా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన విజేత, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కుమారుడి వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఉందని పేర్కొంటూ, ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
