రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసుల మెరుపు తనిఖీలు…
గంజాయి అక్రమ రవాణా, నేరస్తుల కదలికలపై కట్టుదిట్టమైన నిఘా…..
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా మరియు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను అరికట్టేందుకు రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం సీఐ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఈ తనిఖీలు చేపట్టారు.
యువత ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్న గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం, వివిధ నేరాలకు పాల్పడే నిందితుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా రైల్వే స్టేషన్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ సర్వీస్ కేంద్రాలు, హైదరాబాద్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే రైళ్ల బోగీలు, అనుమానాస్పద పార్సిళ్లు, ప్రయాణికుల బ్యాగులు మరియు సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఇతర ప్రాంతాల నుంచి రైల్వే మార్గం ద్వారా నేరస్తులు ప్రయాణించే అవకాశం ఉన్నందున ఆకస్మికంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ కృష్ణ కుమార్ తెలిపారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
