SAKSHITHA NEWS

శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి – రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన
సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుమల శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కోరుకున్నారు. మంగళవారం ప్రాతః కాల సేవలో తిరుమల స్వామి వారిని సేవించి దర్శించుకున్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా మంత్రి దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముందుగా “ఓం నమో వెంకటేశాయ… వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించనః… వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి” అని స్వామి వారిని స్మరిస్తూ స్వామివారిని ప్రాతఃకాల సేవలో సేవించడం అదృష్టం అన్నారు. తాను ప్రధానంగా వేడుకున్నది ఏమంటే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం యాగం తలపెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న తమ ప్రభుత్వాన్ని మరింత అనుగ్రహించమని కోరుకున్నానని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన ఎప్పుడూ కూడా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు, పలు సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఉంటుందన్నారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేద వారు పేదరికం నుండి బయట పడాలనే తపనతో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. వీటి ఫలితంగా ప్రజలు సుస్థిరమైన జీవనాన్ని సాగించే దిశగా పాలన అందిస్తున్నారన్నారు. కానీ దుష్ట శక్తుల పాలనలో పేదవారి ఎదుగుదల సహించని వారు పేద వారి ఉన్నతిని ఓర్వలేక పేదవారిని అలాగే ఉండేలా చేశారని అన్నారు. దుష్ట శక్తుల నుండి జగన్మోహన్ రెడ్డిని రక్షించమని కోరుకున్నట్లు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో పాలకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డిని మరింతగా అనుగ్రహించమని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించమని, ఇప్పటికే సకాలంలో వర్షాలు పడి నదులు చెరువులు నిండి రైతులు సుభిక్షంగా తన పంటలు వేసుకుని ఆనంద పడుతున్న తరుణంలో విపత్తులు రాకుండా చల్లగా చూడమని వేడుకున్నట్లు పేర్కొన్నారు


SAKSHITHA NEWS