SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకులు కె.పి. విశాల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి కొలన్‌ హన్మంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, పెద్దలు కె.ఎం. ప్రతాప్‌, ఎఐసిసి జనరల్‌ సెక్రటరీ, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అబ్జర్వర్‌ శ్రీమతి దీపా అనిల్‌ విచ్చేశారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా నుండి కాపాడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
కుత్బుల్లాపూర్‌ గ్రామంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మింపజేసి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడం జరిగిందన్నారు.
కుత్బుల్లాపూర్‌ గ్రామంలో సర్వే నెం. 151లో 36 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడడం జరిగిందన్నారు. ఆ స్థలంలో ఎమ్మార్వో ఆఫీసు, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు భవనాలను నిర్మింపచేయమని స్ధానిక శాసనసభ్యునికి, రంగారెడ్డి జిల్లా ఎంఎల్‌సికి, ప్రస్తుతం ఉన్న జిల్లా మంత్రికి లేఖ ద్వారా విన్నవించడం జరిగిందన్నారు. కానీ నేటికీ ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించకపోవడంతో అవి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు.
భగత్‌సింగ్‌ నగర్‌లో ఒక ఎకరా 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడి అందులో పేదల కోసం వంద పడకల ఆస్పత్రిని నిర్మించమని నేటి పాలకులను కోరా. కానీ నేటివరకు కార్యరూపం దాల్చలేదు.
దత్తాత్రేయనగర్‌లో 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడి కరెంటు కష్టాల నుండి విముక్తి పొందడానికి అందులో 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను నిర్మింపచేయమని కోరాం. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మించలేకపోయాం.
షాపూర్‌నగర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కాపాడి అందులో రాజీవ్‌గాంధీ పార్కును నిర్మింప చేశామన్నారు.
మీనాక్షి ఎస్టేట్‌లో, గాయత్రినగర్‌లో పార్కులను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు.
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, పేదవారు ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తామన్న మూడు లక్షలు రూపాయలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
స్ధానిక శాసనసభ్యుడు తన అనుచరులతో ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ. అన్ని ప్రాంతాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని సమానంగా చూస్తుందన్నారు. కాంగ్రెస్‌ కా హాత్‌ గరీబోంకా సాత్‌ అన్నారు.
నేటి దుష్ట అహంకార పరిపాలనను అంతమొందించాలంటే ఈ నెల 30వ తేదీన జరగబోయే శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొలను హన్మంత్‌రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ నాయకుడు జహంగీర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పోలీసు జీవేందర్‌రెడ్డి, బెంబడి మల్లారెడ్డి, యుద్ధంరెడ్డి, అవిర జేమ్స్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రాచనోళ్ల లక్ష్మి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లద్దిపీర్ల నర్సింగ్‌గౌడ్‌, తానం శ్రీధర్‌రెడ్డి, రహ్మతుల్లా, బిజ్జిలి కృష్ణ, గార శ్రీనివాస్‌, అల్లాబక్ష్‌, జెస్సీపాల్‌, విజయభాస్కర్‌, జాకీర్‌, రషీద్‌, డివిజన్‌ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్‌ నాయకులు, ఐఎన్‌టియుసి నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 21 At 6.32.31 Pm

SAKSHITHA NEWS