SAKSHITHA NEWS

మీ పంటలన్నీ కొంటాం

  • ప్రకృతి వ్యవసాయ రైతులకు టీటీడీ చైర్మన్ భరోసా సాక్షిత, తిరుపతి బ్యూరో: ఏం దిగులొద్దు... మీరు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయ రైతులకు భరోసా ఇచ్చారు . టీటీడీ శ్వేతా భవనం లో గురువారం గోశాలల నిర్వాహకులు , ప్రకృతి వ్యవసాయ దారుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు . అనంతరం శ్వేతా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు . ఈ సందర్బంగా తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన రైతు జలగం శ్యామ్ టీటీడీ చైర్మన్ తో మాట్లాడారు . తాను గో ఆధారిత వ్యవసాయం తో బియ్యం , కొన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానని చెప్పారు . ఖర్చు ఎక్కువ అవుతోందని , మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని వాపోయారు . బియ్యం కొనుగోలు చేయడానికి జనం పెద్దగా ముందుకు రావడం లేదని , అయినా తాను ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నానని ఆవేదన చెందారు . ఈ సందర్బంగా చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే బియ్యం , బెల్లం ,సెనగలు లాంటి పంటలను టీటీడీ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ధైర్యం చెప్పారు . శ్యాం వద్ద ఉన్న పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు . మరింత మంది రైతులను ప్రోత్సహించాలని రైతు శ్యామ్ కు సూచించారు . చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన రైతు శేషాద్రి రెడ్డి రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు వాడకుండా తయారు చేసిన బెల్లం చైర్మన్ , ఈవో కు రుచి చూపించారు . తమకు మద్దతు ధర ఇచ్చి చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు . ఈ సందర్బంగా రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నవధాన్యాలు , ఆకు కూరలు , కూరగాయలతో వేసిన ముగ్గును చైర్మన్ పరిశీలించారు . అంతకు ముందు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నోడల్ గోశాలల నిర్వాహకులు శశిధర్ (నంద గోకులం గోశాల నెల్లూరు), హరి ప్రభు (ఇస్కాన్ గోశాల చిన్న గొట్టిగల్లు), హరి కృష్ణ స్వామి(ముక్తి ధామం గోశాల దువ్వూరు, వై ఎస్ ఆర్ జిల్లా), వెంకట రాఘవులు (ఉంగుటూరు పశ్చిమ గోదావరి జిల్లా) కు చైర్మన్ ,టీటీడీ ఈవో ధర్మారెడ్డి పంచగవ్య మెడిషనల్ కిట్ అందించారు .

SAKSHITHA NEWS