SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా ‘తెలంగాణ మహిళా సంక్షేమ‘ దినోత్సవ వేడుకలు…

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన “తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ” వేడుకలు ఘనంగా జరిగాయి. గాజులరామారంలోని మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలైన కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్, ఆరోగ్య లక్ష్మీ, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, విహబ్ ద్వారా తమకు జరిగిన మేలును లబ్ధిదారులు వివరిస్తూ సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెండ్లి అంటే బరువు కుంపటి నెత్తిన కుర్చున్నట్టే ఉన్న సందర్భంలో గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా సీఎం కేసీఆర్ మేనమామ పాత్రను తలకెత్తుకునున్నారని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డ పెళ్ళికి లక్ష నూట పదహారు రూపాయలు సలక్షణంగా అందిస్తూ పేదల్లో అలుముకున్న ఆర్ధిక ఇక్కట్లను తగ్గిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాల బాలికలకు, మహిళలకు పలు స్కీంలు అమలు పరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నాణ్యమైన పరికరాలతో కూడిన కేసీఆర్‌ కిట్‌, చిన్నారులు, కిశోరబాలికలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పాటుపడేలా అంగన్‌వాడీ కేంద్రాలను అందించి పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆడ పిల్లలు విద్యారంగంలో ముందుకు రావాలి అనే సంకల్పంతో వారి కోసం ప్రత్యేకమైన గురుకులాలను ప్రభుత్వం స్థాపించిందన్నారు, సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ, వెనుకబడిన – మైనారిటి సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థినుల చదువుల కోసం బృహత్తరమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్నదన్నారు.

మహిళలకు ఉద్యోగ అవకాశాలు, మహిళలు పారిశ్రమికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కలిగించడం కోసం వీహబ్ ఏర్పాటు చేసిందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేళ్ళలో కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ ద్వారా 10777 మందికి రూ.102 కోట్ల 54 లక్షలు, కేసీఆర్ కిట్ 3962 మందికి రూ.5.94 కోట్లు, ఒంటరి మహిళలకు 2014కు ముందుకు సున్నా ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 మందికి రూ.2.41 కోట్లు నెలకు అందజేస్తున్నామన్నారు. 2014లో అంగన్ వాడిలో పని చేస్తే కార్యకర్త పేరును ఇప్పుడు టీచర్ గా మార్చడం జరిగిందన్నారు.

గతంలో జీతం రూ.4500/- ఉంటే ఇప్పుడు రూ.13650/-, హెల్పర్ కాలం గతంలో 2200 ఉంటే ఇప్పుడు 7800/- పెంచడం జరిగిందని, సెలవులు గతంలో 15 రోజులు ఉండగా.. ఇప్పుడు 20 రోజులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రసవించిన మహిళలకు సెలవులు 2014కు ముందు సున్నా అయితే ఇప్పుడు 90 రోజులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలీస్ మహిళా 2014కు ముందు రిజర్వేషన్ సున్నా ఉంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. హోం గార్డ్స్ కు 2014కు ముందు 12 వేలు ఉంటే ఇప్పుడు 20 వేలు అని, డ్వాక్రా రుణాలు మొత్తం 8304 గ్రూపులకు రూ.465 కోట్ల 62 లక్షల రుణాలు అందజేశామన్నారు. ఇలా దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిలు మంగతాయారు, ప్రశాంతి, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి మరియు మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళా అధికారులు, సమైక్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు, అంగన్ వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, మహిళా వ్యాపార వేత్తలు, స్టాఫ్ నర్స్ లు, ఏఎన్ఎంలు, పోలీస్ మహిళా కానిస్టేబుల్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS