SAKSHITHA NEWS

రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య పరిస్థితులపైన ముగ్గురితో బిఆర్ఎస్ కమిటీ నియమించిన కేటీఆర్

హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ

మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లతో త్రీ సభ్య కమిటీ

గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపైన భారత రాష్ట్ర సమితి ఒక నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఏంఏల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కమిటీలో ఉంటారు. డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో ఈ కమిటీ గాంధీ ఆసుపత్రి తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రిలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వైద్య ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఈ నేపద్యంలో పార్టీ తరఫున అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చే అవకాశం కల్పించిన పార్టీకి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. రానున్న వారం రోజులపాటు విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నివేదికను అందజేస్తామని ఆయన తెలిపారు. మేము ఇచ్చే సలహాలు సూచనలతో రాష్ట్రంలోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS