SAKSHITHA NEWS

గవర్నర్ ను కలిసిన ఖమ్మం ఎంపీ
జిల్లా పర్యటనకు రావాల్సిందిగా కోరిన రఘురాం రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్థూపం, కూసుమంచి లో కాకతీయులు నిర్మించిన శైవాలయం.. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానంతో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సింగరేణి, పలు కేంద్రీయ పరిశ్రమలు, ప్రాజెక్టులు, అటవీ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. తమరు రాష్ట్ర గవర్నర్ గా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే.. మరింత ప్రాచుర్యం లభిస్తుందని, వీలైనంత త్వరగా రావాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పందిస్తూ.. తప్పకుండా వీలైనంత త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తానని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి మాటిచ్చారు. ఎంపీ స్పందిస్తూ.. గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు.


SAKSHITHA NEWS