SAKSHITHA NEWS

పండగ వేళ దుర్గమ్మే ఇంటికి వచ్చిందని .. చెత్త కుండీలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న ఎస్సై

లఖ్‌నవూ: ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడతారు. ఆదిపరాశక్తిగా పూజిస్తారు. కానీ భూమ్మీద అడుగుపెట్టిన ఆ పసికందుకు చెత్తకుప్పే దిక్కైంది. తల్లి దగ్గర హాయిగా నిద్రించాల్సిన ఆ బిడ్డ.. వ్యర్ధాల మధ్య గుక్కపట్టి ఏడుస్తోంది. చిన్నారి ఏడుపులను విన్న స్థానికుల సమాచారంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో వెలుగు చూసిన మరో మానవీయ కోణం చూపరుల మనసులను కరిగించింది.

పోలీసుల సంరక్షణలో ఉన్న చిన్నారి కుటుంబీకుల ఆచూకీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి వివరాలు తెలియరాలేదు. దీంతో చిన్నారి పరిస్థితిని చూసి..చలించిన సబ్-ఇన్‌స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్ దంపతులు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సింగ్ మాట్లాడుతూ 2018లో తమకు వివాహం అయినా ఇప్పటికీ పిల్లలు లేరని.. విజయ దశమి నాడు స్వయంగా దుర్గమ్మే ఈ చిన్నారి రూపంలో తమ ఇంటికి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు


SAKSHITHA NEWS