SAKSHITHA NEWS

మాజీ ఎమ్మెల్యే భూమా

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అన్యాయం, అక్రమమని నంద్యాల టిడిపి ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయాన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, టిడిపి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

దాదాపుగా గంటపాటు రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు అరెస్టును ఖండించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని సిఎం జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులపై దాడులు చేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి వైకాపా నాయకులు, సీఎం జగన్ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనలతో జగన్ కు కంటిమీద కునుకు కరువైందన్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడిని అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేయడంపై పోలీసులు అత్యుత్సాహం చూపడం విడ్డూరంగా ఉందన్నారు.

14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎక్కడికైనా పారిపోతాడా.. దొంగల్లా వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు. తాను తప్పు చేస్తే బహిరంగంగా ఉరి తీయండి అన్న చంద్రబాబుకు ఇంకా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నారని, రానున్న రోజుల్లో వాళ్లు తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు అండగా ఉండాలని, భయబ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరని, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర , జిల్లా నాయకులు , అనుబంధ సంఘాల నాయకులు , కౌన్సిలర్ , మాజీ కౌన్సిలర్లు , టిడిపి వార్డు ఇన్చార్జీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS