SAKSHITHA NEWS

చంద్రబాబూ.. మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంది.. జూలు విదల్చండి: కేవీపీ

పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్క నేత కూడా మాట్లాడలేదన్న కేవీపీ

చంద్రబాబు అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత అని ప్రశంస

గత ఎన్నికల్లో ఓడిపోయారన్న కారణంతో ఆయనను కించపరచొద్దని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచన

చంద్రబాబు తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని పిలుపు

చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, ఆయన జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చి ప్రతిపక్షాల ఉద్యమంలోకి రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై పార్లమెంటు వేటు వేసిన నేపథ్యంలో విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చిన్నచిన్న విషయాలకే రాష్ట్ర నేతలు వీధినపడి కొట్టుకుంటున్నారన్న ఆయన.. రాహుల్ గాంధీపై అక్రమంగా కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంటే ఏపీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి, ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా ఖండించకపోవడం బాధాకరమన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటులోనే హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కూడా మాట్లాడలేదని అన్నారు.

అత్యంత గౌరవం ఉన్న ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉన్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించిన కేవీపీ.. 1984లో నాదెండ్ల భాస్కరరావు సంక్షోభ సమయంలో చంద్రబాబు చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరన్నారు.

2018లో ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారన్న కారణంతో ఆయనను కించపరచొద్దని కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించారని కేవీపీ తెలిపారు…. 


SAKSHITHA NEWS