SAKSHITHA NEWS

ప్రధాన మంత్రి భీమా యోజన అమలు పై బ్యాంకర్లు నిర్లక్ష్యం
నిరుపేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భీమా పాలసీల పై ప్రజలకు అవగాహన కల్పించి భీమా చేయించండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారులు, బ్యాంకర్లు పకడ్బందీగా అమలు చేస్తేనే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది – వనపర్తి జిల్లా దిశ చైర్ పర్సన్ డా. మల్లు రవి

*సాక్షిత వనపర్తి

పేదల అభ్యున్నతి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో బిల్లు పెట్టీ అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష యోజన, ఆటల్ భీమా యోజన వంటి ముఖ్యమైన పథకాల పై ప్రజల్లో అవగాహన కల్పించకుండా లక్ష్యం సాధించడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వనపర్తి జిల్లా దిశ కమిటీ చైర్ పర్శన్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా మల్లు రవి అన్నారు.
సోమవారం వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించగా డా. మల్లు రవి అధ్యక్షత వహించారు.


ఈ సమీక్ష సందర్భంగా మొదటగా బ్యాంకర్ల ద్వారా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వాటి లక్ష్య సాధన పై సమీక్ష నిర్వహించారు. ఒక్కో బ్యాంకు కు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన అంశాల పై లీడ్ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్ లను వివరాలు అడిగారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకానికి కేవలం సంవత్సరానికి 430 కడితే 2 లక్షల జీవిత భీమా వస్తుందని, అదే ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకంలో సంవత్సరానికి కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదం జరిగినప్పుడు పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే ఒక లక్ష్య రూపాయలు, శాశ్వత అంగ వైకల్యం ఏర్పడితే 2 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ వస్తుందన్నారు. అటల్ భీమా యోజన పెన్షన్ స్కీం కింద నెలకు రూ. 300/- చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంత ముఖ్యమైన భీమా పథకాలను ప్రజలకు చెరవేయడంలో బ్యాంకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో బ్యాంకు ఒక్కరూ, ఇద్దరు రెండంకెల సంఖ్యలో భీమా చేయించారని వాటిని రెన్యువల్ వచ్చేసరికి జీరో అయ్యిందని అన్నారు. ఇంత నిర్లక్ష్యం ఏమిటని బ్యాంకర్లను ప్రశ్నించారు. ముద్ర రుణాలు, టర్మ్ లోన్, ప్రయారిటీ సెక్టార్, నాన్ ప్రయారిటీ సెక్టార్ వారీగా ఇవ్వాల్సిన రుణాలు సైతం నిర్దేశించిన లక్ష్యాలు సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. పంట రుణాలు సైతం బ్యాంకర్లు లక్ష్యం మేరకు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

వచ్చే దిశ సమావేశం నాటికి ప్రజలకు అవగాహన కల్పించి లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. రైతులకు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ఎస్సి సంక్షేమ శాఖ ద్వారా యువతకు, మహిళలకు స్వయం ఉపాధికి 80 శాతం సబ్సిడీ తో 2021-22 లో మంజూరు అయిన రుణాలు ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాకపోవడం పై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 శాతం డబ్బులు ప్రభుత్వం ద్వారా మంజూరు అయి బ్యాంకుల్లో డబ్బులు మూలుగుతున్న బ్యాంకులు ఇవ్వాల్సిన 20 శాతం ఇవ్వకుండా తాత్సారం చేయడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల్లో సబ్సిడీ రుణాలు గ్రౌన్డింగ్ చేయాలని ఆదేశించారు. కొంతమంది బ్యాంక్ మేనేజర్లు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరు పై కలక్టర్ కు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పేద ప్రజల సంక్షేమం , అభివృద్ధి కొరకు అమలు చేస్తున్న పథకాలను అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా అమలు చేస్తే ప్రజలకు ఫలాలు అందుతాయని సూచించారు.
సమాజంలో కుల మత భేదభవాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 28 సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందనీ తెలియజేశారు. అన్ని మతాలు కులాల విద్యార్థులు ఒకేచోట నాణ్యమైన విద్యను అభ్యసించెందుకు ఒక్కోటి 25 ఎకరాల్లో సమీకృత గురుకుల పాటశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. వనపర్తి జిల్లాలోని ప్రస్తుతం ఉన్న అన్ని గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మేరకు మరుగుదొడ్లు , వాటి మరమ్మతులకు ప్రతిపాదనలు ఇవ్వాలని, ఎంపీ నిధులు మంజూరు చేసి మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి చేయిస్తామని సూచించారు.
అనంతరం విద్యా, వైద్యం, గ్రామీణ అభివృద్ధి శాఖ, మిషన్ భగీరథ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ పై సమీక్ష నిర్వహించారు.
అన్ని గురుకుల పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేయించడానికి దిశ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. వనపర్తి జిల్లా నుండి మిల్లర్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిన బియ్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బియ్యం ఇవ్వని మిల్లర్ల నుండి డబ్బులు వసూలు చేయాలని సూచించారు.
విద్యుత్ శాఖ పై సమీక్ష నిర్వహిస్తూ జిల్లాలో ఇళ్లపై నుండి వెళుతున్న విద్యుత్ తీగలు తొలగింపు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సబ్ స్టేషన్ లో అవసరం పై పూర్తి నివేదిక ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్. ఈ ను ఆదేశించారు. బి.ఎస్.ఎన్.ఎల్ శాఖ సమీక్ష సందర్భంగా జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నల్ కు సమస్య రాకుండా కొత్త సెల్ టవర్ల కు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో దాదాపు అన్ని శాఖల పై సంక్షిప్త సమీక్ష నిర్వహించారు.అక్టోబర్ 22 న నాగర్ కర్నూలు జిల్లాలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ ఒక రోజు వర్క్ షాప్ ఉంటుందని వనపర్తి జిల్లా సంబంధిత అధికారులు సైతం పాల్గొని వర్క్ షాప్ ను విజయవంతం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ రుణాల గ్రౌండింగ్ పై నివేదిక ఇవ్వాలని, అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, డి.సి.సి.బి. చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, మైనారిటీ బోర్డు చైర్మన్ ఒబెదుల్ల కొత్వాల్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, దిశ కమిటీ సభ్యులు కే. వీరయ్య, గంధం ఆంజనేయులు, చిన్నమ్మ థామస్, వెంకటేష్, శంకర్ నాయక్, ధనలక్ష్మి, డి.అర్డీఏ పి.డి. ఉమాదేవి, జిల్లా అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే , బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS