SAKSHITHA NEWS

హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీ చేసేందుకు ప్రయత్నించిన దొంగ పోలీసులకు చుక్కలు చూపించాడు. కళ్లెదుటే దొంగ కనిపిస్తున్నా.. పట్టుకోలేని పరిస్థితి పోలీసులది. వివరాల్లోకి వెళితే.. సాయంత్రం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసి పారిపోయేలోపు ఇంటి యజమాని వచ్చాడు. ఇంటి యజమాని నుంచి తప్పించుకునే క్రమంలో దొంగ చెరువులోకి దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దొంగను చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా.. పట్టుకోండి చూద్దాం! అన్నట్టు చెరువు మధ్యలోనే తిష్ట వేశాడు. చీకటి పడటంతో దొంగను ఎలా పట్టుకోవాలా అని పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. చెరువు మధ్యలో కూర్చున్న దొంగను చూసేందుకు స్థానికులు భారీగా గుమికూడారు.


SAKSHITHA NEWS