
పారిశుధ్య కార్మికులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు.
బ్యాంకు పాస్పుస్తకాలు, ఏటీఎం కార్డులు కార్మికులకు ఇచ్చివేయాలి.
అధిక వడ్డీలు వసూలు చేస్తూ( రాబందులుగా) కార్మికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు.
మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు హెచ్చరిక.
సాక్షిత :(పల్నాడు జిల్లా చిలకలూరిపేట):మున్సిపల్ పారిశుధ్య కార్మికల వద్ద కొంతమంది వడ్డీ వ్యాపారులు బ్యాంకు పాస్ పుస్తకాలు, ఏటీఎంలు కార్డులు తమ వద్ద ఉంచుకొని అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నట్లు తెలిసిందని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు సోమవారం హెచ్చరించారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో 300 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుంటే,ఇందులో 35 మంది మాత్రమే పర్మినెంట్ కార్మికులుగా ఉన్నారని వెల్లడించారు.
అయితే ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న కార్మికుల్లో కొంతమంది మద్యానికి, ఇతర వ్యసనాలకు బానిసలుగా మారారని చెప్పారు. వీరి బలహీనతను ఆసరాగా తీసుకొని కొంతమంది వడ్డీ వ్యాపారులు రూ. 10 ఆ పై వడ్డీకి డబ్బులు ఇచ్చి, వారి ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు, ఇటువంటి వారిపై చర్యలుతీసుకోవడంజరుగుతుందన్నారు. కార్మికులకు బ్యాంకుల వారితో మాట్లాడి అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తానని, అవసరమైన ఇటువంటి రుణాలు తీసుకొని బ్యాంకు పాస్పుస్తకాలు, ఏటీఎం కార్డులు తీసుకోవాలని సూచించారు. ఇటువంటి రుణాలతో వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, వారి భవిష్యత్తు అవసరాలకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. వడ్డీ వ్యాపారులు పారిశుధ్య కార్మికులను ఇబ్బందులకు గురి చేయరాదని,వారి బ్యాంకు పాస్పుస్తకాలు, ఏటీఎంకార్డులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. అలా కాని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.మున్సిపల్ పారిశుధ్య కార్మికులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app