SAKSHITHA NEWS

ఆ కామెంట్స్ పట్టించుకోను.. సీఎం చంద్రబాబు సీరియస్

ఎన్నో చెబుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. అన్నీ పట్టించుకొనే పరిస్థితుల్లో మేము లేము. మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎన్నో చెబుతుంటారు.. విమర్శిస్తుంటారు. మా దారి రహదారే అంతేకానీ.. ఏమీ పట్టించుకోము అంటూ సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు.

ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ కూడ తనదైన శైలిలో వైసీపీపై విమర్శలు కురిపించారు. ఒక్క ఐదేళ్లు ప్రజలు ఛాన్స్ ఇస్తే.. 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని మాజీ సిఎం జగన్ లక్ష్యంగా చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీకి నష్టం జరగలేదని, కేవలం వైసీపీ పాలనతో విధ్వంసం జరిగిందన్నారు. సంపద సృష్టించాలన్న లక్ష్యంతో కూటమి ఉంటే, సంపద దోచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ పాలన సాగిందన్నారు.

తమ ఏడేళ్ల పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశామని, కేవలం 7 నెలల్లో రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు చంద్రబాబు పునరుద్ఘాటించారు. దావోస్ పర్యటనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ.. పర్యటన విజయవంతమైందని, దాని ఫలితాలు త్వరలోనే దేశవ్యాప్తంగా మారుమ్రోగుతాయని సీఎం అన్నారు. అంతర్జాతీయ పరిశ్రమలు రానున్నాయని, ఏపీకి వచ్చిన నష్టమేమీ లేదని, ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తామన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాజకీయ లబ్ధి కోసం కొందరు విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు కొట్టిపారేశారు. ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీలతో మోదీ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. దేశమంటే మట్టికాదోయ్ – దేశమంటే మనుషులోయ్ అని తెలుగుకవి గురజాడ అప్పారావు చెప్పిన సూక్తిని బడ్జెట్ తొలి వ్యాఖ్యాల్లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు. అమరావతికి ఈ ఏడాదిలోనే రూ. 15 వేల కోట్లు కేటాయించబోతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇచ్చి కేంద్రం ఆదుకుంటుందన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు రూ.12,157 కోట్లు ప్రకటించిన కేంద్రం ఈ బడ్జెట్ లో రూ. 5,936 కోట్లు కేటాయించిందని, విశాఖ స్టీల్ ను ఆదుకునేందుకు బడ్జెట్ కు ముందే కేంద్రం రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్నారు. ఈ బడ్జెట్ లో రూ. 3,295 కోట్లు కేటాయించారని, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, విశాఖ-చెన్నై కారిడార్ కు రూ.285 కోట్లు కేటాయించారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపనలు చేశారని, కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి రూ. 5 కోట్ల నిధులు ప్రకటించారన్నారు. కేంద్రం ఇచ్చే సాయం ఏమిటో ఏపీ ప్రజలు కళ్లారా చూస్తున్నారని, దేశంలో ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. అక్కడ ప్రచార పర్వం గురించి మాట్లాడి, వైసీపీ పాలనపై సీరియస్ కామెంట్స్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app