డా.వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు మీకే సొంతం.

Spread the love

Dr. YSR Digital Libraries librarian jobs are yours.

డా.వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు మీకే సొంతం..

      ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులకు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ

    

‘డిజిటల్ లైబ్రరీలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాం.. ముమ్మాటికీ లైబ్రరీ సైన్స్ కోర్సులు చేసిన వారితోనే భర్తీ చేస్తాం.. బాగా చదువుకోండి.. ఉద్యోగాలు సాధించండి.. మనమందరం మరోమారు కలిసి సంతోషం పంచుకుందాం.

.’ అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులతో అన్నారు. విజయవాడ పట్టణంలోని ఏలూరులాకులు (సినీనటుడు శోభన్ బాబు విగ్రహం) నుండి పాత ప్రభుత్వ వైద్యాశాల మీదుగా పండిట్ నెహ్రు బస్టాండు దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

వైయస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డా.వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నందుకు రాష్ట్రంలోని రెండు లక్షల మంది లైబ్రరీ సైన్స్ నిరుద్యోగుల తరపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు

. ఈ సందర్భంగా లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బడిశం రమణప్ప, కార్యదర్శి మహేంద్ర, కోశాధికారి జగదీష్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేసారు.

రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది వరకు లైబ్రరీ సైన్స్ చేసిన వారు ఉన్నారని, ఎన్నో ఏళ్లుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ కాకపోవడంతో సుమారు రెండు లక్షల మంది లైబ్రరీ సైన్స్ కోర్సులు చేసి నిరాశ నిస్పృహలతో ఆవేదన చెందుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైయస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామమన్నారు

. డిజిటల్ లైబ్రరీల నిర్వహణకై భర్తీ చేయబోయే లైబ్రేరియన్ పోస్టులు లైబ్రరీ సైన్స్ కోర్సులు చేసిన వారితో భర్తీ చేయాలన్నారు. ఈ పోస్టుల కోసం లైబ్రరీ సైన్స్ కోర్సులు చేసిన ఉద్యోగులు ఎంతో మంది ఎదురుచూస్తున్నారని వివరించారు. అనంతరం మాకినేని బసవపున్నయ్య సమావేశ మందిరం నందు ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరి రావు, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర కల్కుర, కార్యదర్శి రావి శారదల చేతుల మీదుగా ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసిన ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ జగనన్న ఏర్పాటు చేసిన డా. వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి కృతజ్ఞతగా జగనన్నకి ధన్యవాదాలు అనే గోడపత్రికను విడుదల చేశారు.

తదనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి డిజిటల్ లైబ్రరీలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. లైబ్రరీ సైన్స్ కోర్సులు చేసిన వారితోనే పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.

బాగా చదివి ఉద్యోగాలు సాధించి రండి.. మనమందరం కలిసి ఇంకోసారి సంతోషంగా సమావేశమవుదామన్నారు. దీంతో అక్కడే ఉన్న వందలాది మంది లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు హర్ష ధ్వానాలతో సజ్జల రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..

డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై ప్రకటన విడుదల నాటి నుండి లైబ్రరీ పోస్టుల భర్తీ విషయంలో లైబ్రరీ సైన్స్ కోర్సులు చేసిన తీవ్రంగా మదనపడ్డారని.. సజ్జల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన హామీతో అనుమానాలు అన్నీ తొలగిపోయాయన్నారు. ఈ నిర్ణయం రెండు లక్షల మంది కుటుంబాలకు పండుగ లాంటి వార్తగా అభిప్రాయపడ్డారు.

న్యాయమైన తమ కోర్కెలకు, కృతజ్ఞతా ర్యాలీకి సానుకూలంగా మద్దత్తు తెలిపిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఎల్ఎ అధ్యక్షులు చంద్రశేఖర కల్కుర, కార్యదర్శి రావి శారదలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో.. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ జేఏసీ రాష్ట్ర నాయకులు బడిశం రమణప్ప, జగదీష్ కలేరావు, సీ.మహేంద్ర, రమేష్ బాబు, సాయిబాబు, నట్టం ఉష, అన్నపూర్ణ, రాష్ట్రం నలుమూలల నుండి వందల సంఖ్యలో లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page