
జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాల నిర్ణయం తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగడం ఖాయం
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
జనాభా ప్రాతిపదికన లోక్ సభ స్థానాలను డీ – లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభ పడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఎంపీ స్థానాల విధానాన్నే కొనసాగించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపధికన లోక్ సభ స్థానాలను డీ లిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే లాభం జరుగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో జనాభా సంఖ్య తక్కువగా ఉందని వినోద్ కుమార్ తెలిపారు.
1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని లోక్ సభ స్థానాలను నిర్ణయించారని, ఇక ముందు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని, అవసరం అయితే అందుకు రాజ్యాంగాన్ని సవరించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్థాలిన్ ఈరోజు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు బట్టారాని, ఈ నిర్ణయాన్ని బీ ఆర్ ఎస్ పార్టీ స్వాగతిస్తోందని వినోద్ కుమార్ అన్నారు.
ఉదాహరణకు తీసుకుంటే 1971 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జనాభా 8.8 కోట్లు కాగా, తాజా జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే 24 కోట్లకు చేరుతుందని, ధీంతో యూపిలో ఎంపీ స్థానాలు అమాంతం భారీగా పెరుగుతాయని వినోద్ కుమార్ వివరించారు.
రానున్న రోజుల్లో తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో కార్యాచరణను రూపొందిస్తామని వినోద్ కుమార్ ప్రకటించారు.
